

2023 ప్రారంభంలో అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన అకౌంటింగ్ అవకతవకలు, షేర్ల విలువలను కృత్రిమంగా పెంచినట్లు ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ సుమారు 150 బిలియన్ డాలర్లు (రూ.13.5 లక్షల కోట్లు) తగ్గిపోయింది. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చిన గ్రూప్, తమ మూలధన సామర్థ్యంపై ఎలాంటి ఇబ్బందులు లేవన్న సంకేతాలు ఇవ్వడానికి కొనుగోళ్లపై దృష్టి పెట్టింది.
2023 జనవరి నుంచి ఇప్పటివరకు అదానీ గ్రూప్ వివిధ రంగాల్లో 33 కొనుగోళ్లను పూర్తి చేసింది. వీటి మొత్తం విలువ సుమారు రూ.80,000 కోట్లు (9.6 బిలియన్ డాలర్లు). గత మూడు సంవత్సరాల్లో అతిపెద్ద లావాదేవీగా, ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్ల్యాండ్ ఎక్స్పోర్ట్ టర్మినల్ను అదానీ పోర్ట్స్ రూ.21,700 కోట్లకు సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిమెంటు రంగంలో వరుస కొనుగోళ్లతో దేశీయ అగ్రగామి సంస్థలతో పోటీపడే స్థాయికి గ్రూప్ చేరుకుంది.
సిమెంటుతో పాటు ఓడరేవులు, విద్యుత్, డేటా సెంటర్లు, రోడ్లు, స్థిరాస్తి, విద్యుత్ పంపిణీ వంటి రంగాల్లోనూ అదానీ గ్రూప్ విస్తరణ కొనసాగిస్తోంది. రాబోయే అయిదేళ్లలో మూలధన వ్యయాల కింద సుమారు రూ.10 లక్షల కోట్లు వెచ్చించాలని గ్రూప్ భావిస్తోంది. మౌలిక వసతులు, ఇంధనం, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులు మరియు కొనుగోళ్ల ద్వారా మరింత వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!