

తెలంగాణలో గాలి నాణ్యత మెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలతో శాస్త్రీయ విధానాన్ని అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో నిర్వహించిన “ గాలి నాణ్యత సూచీ మరియు గాలి నాణ్యత నిర్వహణ ” సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత పర్యవేక్షణ కోసం 40 కొత్త స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలో ప్రజలకు అందుబాటులో ఉండే గాలి నాణ్యత డ్యాష్బోర్డులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.
గాలి నాణ్యత కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాకుండా ప్రజారోగ్యం, ఉత్పాదకత, ఆర్థిక అభివృద్ధికి కూడా కీలక సూచీ అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. స్వచ్ఛమైన రవాణా, పరిశ్రమల ఉద్గారాల నియంత్రణ, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. కాలుష్య ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు ప్రత్యేక బృందాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, శుభ్రమైన గాలి కోసం ప్రభుత్వంతో పాటు పౌరులు కూడా భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!