నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైంది. ఉత్తమ నటుడిగా నాగ చైతన్య అవార్డు అందుకోగా, ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా కూడా ఈ సినిమా గుర్తింపు పొందింది. ఇందులో రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య రా అండ్ రస్టిక్ లుక్లో సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సందర్భంగా నాగ చైతన్యను ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్తో సత్కరించనుంది. నటుడిగా ఆయన ప్రతిభతో పాటు, సామాజిక అంశాలను ప్రతిబింబించిన ఈ సినిమా మంచి గుర్తింపును సాధించింది.
అవార్డు గురించి మాట్లాడిన నాగ చైతన్య, తన భార్య శోభితా ధూళిపాళను తనకు ప్రేరణగా, శక్తిగా పేర్కొన్నారు. “తండేల్ భారీ విజయాన్ని సాధించడం, వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం, ఇప్పుడు గద్దర్ అవార్డులో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఈ అద్భుత ఘట్టాలన్నీ శోభితా నా జీవితంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. ఆమె ఖచ్చితంగా నా లేడీ లక్,” అని చై అన్నారు. ఇంట్లో ఉన్న మద్దతు, బలం వృత్తి జీవితంలో కూడా ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత తనకు అదృష్టం కలిసి వచ్చిందని నాగ చైతన్య పేర్కొన్నారు.
నాగ చైతన్య 2024లో శోభితా ధూళిపాళను వివాహం చేసుకున్న తర్వాత విడుదలైన ‘తండేల్’ సినిమా ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతకుముందు ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘కస్టడీ’ వంటి సినిమాలతో ఎదురైన పరాజయాల తర్వాత ‘తండేల్’ అతనికి పెద్ద విజయాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామానికి చెందిన మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని నాగ చైతన్య తెలిపారు. వారి కష్టాలు, ధైర్యం, రోజువారీ జీవితం తెలుసుకోవడానికి వారి మధ్య గడిపిన అనుభవం తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని ఆయన చెప్పారు.

























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!