

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో ఇటీవల చోటుచేసుకున్నట్లు చెబుతున్న ఘటనలను ఆయన ప్రస్తావించారు. మహబూబాబాద్లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి పట్ల క్రూరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేసి అవమానకరంగా ప్రవర్తించారనే ఆరోపణలను కూడా ప్రస్తావించారు.
సూర్యాపేటలో సోషల్ మీడియా పోస్టుల విషయంలో కేసులు నమోదు చేస్తున్నారని, కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపును నిరసించిన వారిపై సీఐ దౌర్జన్యానికి పాల్పడ్డారని హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వం పనిచేస్తోందా? లేక పోలీసు పాలన కొనసాగుతోందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, హక్కులు అడిగితే దౌర్జన్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ డీజీపీని కోరుతూ, ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!