

నేపాల్లో సంభవించిన వరదల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ ప్రవాసాంధ్ర కుటుంబం గల్లంతైనట్లు సమాచారం. పట్టణంలోని పండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూకు ముగ్గురు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు సంతోష్ కుమార్ సాహూ (47) తన భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా సాహు (13)తో కలిసి దాదాపు 20 ఏళ్లుగా లండన్లో స్థిరపడ్డారు. ఇటీవల వారు లండన్ నుంచి నేపాల్ మీదుగా మానససరోవర యాత్రకు బయలుదేరారు. యాత్రలో భాగంగా ఓ వంతెనపై వాహనంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తడంతో వాహనం గల్లంతైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల ఆచూకీ లభించలేదు.
నేపాల్ గైడ్ ద్వారా ఈ ఘటన గురించి సంతోష్ బంధువులకు సమాచారం అందింది. సంతోష్ తల్లిదండ్రులు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ రెండో కుమారుడు మురళీ సాహూ వద్ద ఉంటున్నారు. యాత్రకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ప్రకృతి విపత్తులో చిక్కుకున్నారన్న వార్తతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పార్వతీపురంలోని బంధుమిత్రుల్లోనూ ఆందోళన నెలకొంది. గల్లంతైన కుటుంబం ఆచూకీ కోసం వారు తీవ్ర ఆతృతతో ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!