

కొత్తగా విడుదలైన టాక్సిక్ సినిమాపై మరో వివాదం తెరపైకి వచ్చింది. సినిమాపై రివ్యూ ఇచ్చిన యూట్యూబర్ సూరజ్ కుమార్కు లీగల్ నోటీసు అందడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్లో తన రివ్యూను పోస్ట్ చేసిన అనంతరం సూరజ్ కుమార్ నోటీసు స్క్రీన్షాట్ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సినిమా సంస్థతో సంబంధం ఉన్న కేవీఎన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ తరఫున ఐప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నోటీసును జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసు అందినప్పటికీ రివ్యూ వీడియో ఆన్లైన్లో అందుబాటులోనే ఉన్నట్లు సమాచారం.
ఆగస్టు 22న బెంగళూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. టాక్సిక్పై తప్పుడు లేదా పరువునష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని నిరోధిస్తూ కోర్టు ఏకపక్ష మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28న జరగనున్న తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ దాఖలు చేసిన ఈ కేసులో ఎక్స్ కార్ప్తో పాటు గుర్తుతెలియని వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. అయితే ఈ ఉత్తర్వులు ప్రత్యేకంగా తప్పుడు లేదా పరువునష్టం కలిగించే కంటెంట్కే వర్తిస్తాయని, సినిమాపై వచ్చే అన్ని ప్రతికూల రివ్యూలను నిషేధించినట్లు కాదని స్పష్టమవుతోంది. దీంతో సినిమా రివ్యూలు, విమర్శించే స్వేచ్ఛ, నెగెటివ్ కంటెంట్పై లీగల్ నోటీసుల వినియోగంపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!