

ఇరాన్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ పై ఇంకా స్పష్టత లేదు. ఈ ఒప్పందాన్ని అంగీకరించినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై దాడులను కొనసాగిస్తామని తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించారు. ఈ ప్రకటన పై ఇరాన్ జాతీయ భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. లెబనాన్లో దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. కాల్పుల విరమణ పై ఇరువర్గాల మధ్య అనిశ్చితి కొనసాగుతుండటమే ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. లెబనాన్లో పనిచేస్తున్న హెజ్బొల్లా ఇప్పటికే కాల్పుల విరమణకు అనుకూలంగా సంకేతాలు ఇచ్చింది. అయితే ఇజ్రాయెల్ వైఖరి మాత్రం మారలేదు.
ఈ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమని మధ్యవర్తిత్వం చేసిన పాకిస్థాన్ వెల్లడించింది. అమెరికాతో కుదిరే ఒప్పందంలో లెబనాన్లో కూడా కాల్పులు ఆగాలని ఇరాన్ కోరగా, ఇజ్రాయెల్ దీనికి అంగీకరించడం లేదు. మరోవైపు హెజ్బొల్లా దాడులను అడ్డుకునేందుకు లిటాని నది వరకు భద్రతా మండలం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మార్చి రెండో తేదీన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లో భూసేన చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి జరిగిన దాడుల్లో సుమారు వెయ్యిన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు పన్నెండు లక్షల మంది ప్రజలు నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఈ చర్యలను నిలిపివేయడానికి సిద్ధంగా లేదని తెలుస్తోంది. దాడులు కొనసాగితే తాత్కాలిక కాల్పుల విరమణ శాశ్వత ఒప్పందంగా మారే అవకాశాలు తగ్గిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!