

తిరుమలలో ధనుర్మాసం డిసెంబర్ 16 న మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిసెంబర్ 17 ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పాశుర పారాయణం ప్రారంభమై జనవరి 14 వరకు కొనసాగుతుంది. ధనుర్మాసాన్ని శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో స్వామివారికి బిల్వపత్రాలతో సహస్ర నామార్చన, ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించడంతో పాటు విశేష ప్రసాదాలు నివేదిస్తారు. శ్రీ విల్లిపుత్తూరు చిలుకలతో స్వామివారిని అలంకరిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తారని, అందువల్ల ఈ మాసానికి విశేష ప్రాధాన్యం ఉందని తితిదే తెలిపింది.
ఆండాళ్ (గోదాదేవి) రచించిన 30 పాశురాల సమాహారమే తిరుప్పావై. ఇది ఆళ్వార్ దివ్యప్రబంధంలో ముఖ్య భాగం. తిరుమలలో నెల రోజులపాటు రోజుకు ఒక పాశురం చొప్పున అర్చకులు ఏకాంతంగా పారాయణం చేస్తారు. ఈ సమయంలో భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా తోమాల, అర్చన వంటి కొన్ని ఆర్జిత సేవలను జనవరి 14 వరకు భక్తుల అనుమతి లేకుండా ఏకాంతంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు కొన్ని సేవలు రద్దు చేయగా, జనవరి 2 నుంచి 8 వరకు కొన్ని ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయి. ఈ మార్పులను భక్తులు గమనించి తితిదేకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!