

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంటూ మాజీ భారత క్రికెటర్ సైరాజ్ బహుతులే ను భారత సీనియర్ పురుషుల జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించింది. దేశీయ క్రికెట్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), ఇండియా ‘ఎ’, అండర్-19 జట్లు మరియు ఐపీఎల్లో విశేష అనుభవం కలిగిన బహుతులేకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఆయన అనుభవం భారత స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
53 ఏళ్ల సైరాజ్ బహుతులే భారత దేశీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. రెండు టెస్టులు, ఎనిమిది వన్డేల్లో మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 188 మ్యాచ్ల్లో 6,176 పరుగులు, 630 వికెట్లు సాధించి అరుదైన ఘనతను అందుకున్నారు. కోచ్గా కేరళ, బెంగాల్, విదర్భ, గుజరాత్ జట్లకు సేవలందించడంతో పాటు ఐపీఎల్లో కూడా పనిచేశారు. 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత భారత జట్టు కోచింగ్ సిబ్బందిలో భాగమైన ఆయన, యువ స్పిన్నర్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తన నియామకాన్ని గౌరవంగా భావిస్తున్నానని, భారత జట్టు విజయాల కోసం కృషి చేస్తానని బహుతులే తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!