

టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. సిద్దార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 24న పురుగుల మందు కలిపిన శీతల పానీయం తాగిన ఘటనలో ప్రత్యూష మృతి చెందగా, సిద్దార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఆత్మహత్యాయత్నమని మొదట భావించినా, పోస్టుమార్టం నివేదికలో గాయాలు బయటపడటంతో అనుమానాలు తలెత్తాయి. ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మొదటి నుంచీ హత్య ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటం కొనసాగించారు.
2004లో సెషన్స్ కోర్టు సిద్దార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, 2011లో హైకోర్టు దానిని రెండేళ్లకు తగ్గించింది. శిక్ష రద్దు చేయాలని సిద్దార్థ రెడ్డి, శిక్ష పెంచాలని సరోజినీ దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సిద్దార్థ రెడ్డి లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. దాదాపు 24 ఏళ్ల న్యాయపోరాటానికి ఈ తీర్పుతో ముగింపు లభించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!