

డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నియమాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ స్పష్టం చేశారు. బుధవారం నుంచి డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు, డిసెంబర్ 31న నగరవ్యాప్తంగా సుమారు 100 ప్రాంతాల్లో చెక్పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామని తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ నిర్వాహకులు లేదా పాల్గొనే వారు హద్దుమీరినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. “నియమాలు పాటించకపోతే కొత్త సంవత్సరం సంతోషంగా ప్రారంభం కాదు” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాల పై క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలన్నారు. పార్టీలు, ఈవెంట్ల నిర్వహణకు పోలీస్ అనుమతుల కోసం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో సౌండ్ సిస్టమ్స్, లౌడ్ స్పీకర్లు రాత్రి 10:00 గంటలకల్లా నిలిపివేయాలని ఆదేశించారు. మహిళల భద్రత దృష్ట్యా 15 షీటీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు సీపీ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!