

ఆస్ట్రేలియాలో తీవ్ర హింసాత్మక ఘటనకు కారణమైన సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ నగరంతో ఉన్న సంబంధాల పై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. అతడు విద్యార్థి దశలోనే ఉగ్రవాద భావజాలానికి లోనయ్యాడా? లేక నగరానికి వచ్చిన సందర్భాల్లో ఎవరైనా స్లీపర్ సెల్స్తో సంబంధాలు ఏర్పడ్డాయా? అనే అంశాలను ప్రధానంగా పరిశీలిస్తున్నారు.
ఈ దర్యాప్తులో భాగంగా సాజిద్ అక్రమ్ కు చెందిన బంధువులు, సంబంధీకుల నుంచి అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. టోలిచౌకిలో జన్మించి పెరిగిన సాజిద్ అక్రమ్ తండ్రి భారత ఆర్మీలో ఉద్యోగిగా పని చేసినట్టు గుర్తించారు.
బీకాం పూర్తి చేసిన సాజిద్ అక్రమ్ ఉద్యోగ అవకాశాల కోసం 1988 లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ నివసిస్తున్న యూరోపియన్ మహిళ వెనెరా గ్రొస్సోను 1989 లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. వీరిలో కుమారుడు నవీద్ అక్రమ్ (24) తన తండ్రితో కలిసి హింసాత్మక ఘటనలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.
వివాహం, ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తడంతో సాజిద్ అక్రమ్ తన బంధువులతో సంబంధాలు తగ్గించుకున్నట్టు సమాచారం. ఈ కారణంగానే అతడు కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
సాజిద్ అక్రమ్ సోదరుడు సాహిద్ అక్రమ్ పాత నగర ప్రాంతంలోని ఒక ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్గా పని చేస్తున్నాడు. 1998 నుంచి 2022 మధ్యకాలంలో సాజిద్ ఆరుసార్లు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్శనల సమయంలో తల్లిదండ్రులను కలవడం, ఆస్తి విక్రయాలకు సంబంధించిన పనులు నిర్వహించినట్టు తేలింది.
2022 తర్వాత అతడు భారత్కు రాలేదని, తండ్రి మరణించిన సమయంలో కూడా స్వదేశానికి రాకపోవడంతో పాటు కుటుంబంలోని ఇతర శుభకార్యాలకు కూడా హాజరు కాలేదని అధికారులు తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!