

హైదరాబాద్ మహానగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడుతోంది. రాబోయే ఆరు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 2,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రేటర్లో ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుపై టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (పీఎంఈ-డ్రైవ్) పథకం కింద, పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ను పూర్తి చేసింది.
ఈ డ్రైవ్లో భాగంగా గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో మూడు కేటగిరీలకు చెందిన మొత్తం 3,489 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో మొదటి దశలో ఆరు నెలల వ్యవధిలో 2,000 వరకు స్టేషన్లను ప్రారంభించాలన్నదే లక్ష్యంగా ఉంది.
కేటగిరి (ఎ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాస సముదాయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం రాయితీని అందిస్తోంది. కేటగిరి (బీ)లో జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల పరిసరాలు, బస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, టోల్ ప్లాజాల వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టేషన్లకు 70 నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తోంది. అలాగే కేటగిరి (సీ)లో ప్రధాన రహదారులు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ల వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు కేంద్ర ప్రభుత్వం 80 శాతం వరకు రాయితీని అందిస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!