

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కు ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ (ఓజిఎల్) 1,085 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ, ఒలెక్ట్రా సంస్థకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) జారీ చేసింది. ఇది పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద పర్యావరణ అనుకూల ఇంధనాన్ని ప్రోత్సహించే సీఈఎస్ఎల్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
ఓజిఎల్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన తయారీ సంస్థ. ఈ సంస్థ రూపొందించే బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఈ బస్సులు హైదరాబాద్ ప్రజలకు సుస్థిర, పర్యావరణహిత ప్రజా రవాణా సేవలను అందించనున్నాయి. ప్రతి బస్సు ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఆధునిక ఎయిర్ సస్పెన్షన్, వీల్చైర్ సదుపాయాలు, మరియు సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓలెక్ట్రా సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా 3,600కి పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 10,000 వాహనాల ఆర్డర్లు ఉన్నాయి. 500 మిలియన్ గ్రీన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన ఈ వాహనాలు కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాయి. సంస్థ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కాకుండా, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడే ఎలక్ట్రిక్ టిప్పర్లను కూడా తయారు చేస్తోంది.
ఓలెక్ట్రా ఎండీ మహేష్ బాబు మాట్లాడుతూ, “ఇది మా సంస్థకు ఒక చారిత్రాత్మక ఘట్టం. ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యంతో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనే మా సంకల్పానికి పీఎం ఈ-డ్రైవ్ ప్రాజెక్ట్ బలం చేకూర్చింది. టీజీఎస్ఆర్టీసీతో కలిసి సుస్థిర ప్రజా రవాణా సేవలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము” అన్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!