

వరుస సెలవులతో తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీవారి దర్శనానికి వేచి ఉండే సమయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 24 నుంచి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా, క్యూలైన్లు బయట శిలాతోరణం వరకు దాదాపు కిలోమీటర్ల మేర విస్తరించాయి.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ఉన్న భక్తులకు దర్శనానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది. మరోవైపు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. తనిఖీల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అలిపిరి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరగా, సప్తగిరి నుంచి దివ్యరామం వరకు వాహనాలు నిలిచిపోయాయి.
భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ క్యూలైన్లోకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం క్యూలైన్లో ఇప్పటికే భారీగా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి ఇంకా 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులను మళ్లీ క్యూ లైన్లోకి అనుమతించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాల దృష్ట్యా టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో డిసెంబర్, జనవరి నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, తాగునీరు, పాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.
వైకుంఠ ఏకాదశికి ముందే భక్తుల రద్దీ భారీగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతం పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!