

నగరంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్కు ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రేమ సంబంధాలే కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహాల మాటున కూడా కొందరు మోసగాళ్లు యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం నిర్వహించి విశ్వాసం సంపాదించిన తర్వాత బాధితులకు దగ్గరవుతూ భావోద్వేగంగా ప్రభావితం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పెళ్లి ఖాయం అయిందనే నమ్మకంతో యువతులను మానసిక ఒత్తిడికి గురిచేసి శారీరక సంబంధాలకు ఒత్తిడి తెస్తున్నారు. అనంతరం భారీ మొత్తంలో డబ్బు లేదా అదనపు కట్నం డిమాండ్ చేస్తూ, ఇవ్వకపోతే పెళ్లి రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. నిశ్చితార్థం జరిగిన విషయం బంధుమిత్రులకు తెలిసిపోవడంతో పరువు పోతుందనే భయంతో చాలామంది ఫిర్యాదు చేయకుండా వెనుకడుగు వేస్తున్నారు. అబ్బాయి నేపథ్యం, ప్రవర్తనపై ముందుగానే ఆరా తీయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేసినా లేదా బ్లాక్మెయిల్ చేసినా వెంటనే షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 లేదా 100కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!