

ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటివరకు 290 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించి, సుమారు రూ.10 వేల కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరయ్యారు. అలాగే వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్, మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మహిళా ఐఏఎస్ అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు కోట్లాది మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించి భారీగా డబ్బు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికుల్లో మహిళల సంఖ్య గణనీయంగా ఉందని, 97 డిపోల ద్వారా బస్సులు సుమారు 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని వివరించారు. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు చేసిన కృషి వల్ల ఈ పథకం విజయవంతమైందని ప్రశంసించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణించవచ్చని, దీనిపై కొంతమంది చేసిన తప్పుడు ప్రచారాలను మహిళలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రుణాలు, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని హామీలను నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!