

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాకర్షక హామీలు ప్రకటిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాలలకు వెళ్లే బాలికలకు నెలకు ₹1,000 ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛనును ₹3,000కు పెంపు, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల బీమా, వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ₹5 లక్షల వరకు వడ్డీలేని రుణం అందిస్తామని హామీ ఇచ్చారు. తిరువనంతపురంలో జరిగిన సభలో మాట్లాడుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీ నియంత్రణలో పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఆయనపై సీబీఐ, ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. భారతదేశానికి చెందిన విలువైన డేటా వనరులను అమెరికాకు అప్పగించారని, ఇది దేశ రైతులకు మోదీ చేసిన ద్రోహమని అన్నారు. తిరువనంతపురంలోని టెక్నోపార్క్లో ఐటీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారత డేటా ప్రపంచంలో అత్యంత విలువైనదని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే తాను విమానయాన రంగంలో పారిశ్రామికవేత్తగా ఉండేవాడినని కూడా తెలిపారు. తన తండ్రి, చిన్నాన్న ఇద్దరూ పైలట్లే కావడంతో ఆ రంగంపై తనకూ ఆసక్తి ఉందన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!