

జిల్లాలో ఏకైక పురాతన క్షేత్రమైన వాల్మీకి క్షేత్ర పట్టాభి రామాలయం ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఘన చరిత్ర, విశిష్ట కీర్తి ఉన్న ఈ ఆలయాన్ని 1997 లో తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) దత్తత తీసుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని భక్తులు వాపోతున్నారు. ఆలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో స్వామివారికి సంబంధించిన ఆర్జిత సేవలు భక్తులకు అందుబాటులో లేవు. వారంలో ఒక్కరోజైనా అభిషేక సేవలను ప్రారంభించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేకపోవడం బాధాకరమని అంటున్నారు.
గతంలో ప్రతి శనివారం నిర్వహించే ఊంజల్ సేవను నిలిపివేయడంతో పాటు, ఇతర తితిదే రామాలయాల్లో అమలులో ఉన్న అష్టోత్తర శత కలశాభిషేకం, హనుమంత వాహన సేవలు, అన్నదాన కార్యక్రమాలు వాల్మీకి క్షేత్రంలో అమలుకాకపోవడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. సుందర కాండ హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నా తితిదే అధికారులు స్పందించడంలేదని ఆరోపిస్తున్నారు. ఆదాయం లేదన్న కారణంతో ఆధ్యాత్మిక సేవలను నిర్లక్ష్యం చేయడం తగదని, ఇప్పటికైనా స్వామివారి ఆర్జిత సేవలను ప్రారంభించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించాలని తితిదేను భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!