

ఒమన్ వేదికగా ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఈ చర్చలు విఫలమైతే బలప్రయోగానికీ వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. గురువారం అమెరికా కాలమానం ప్రకారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఒమన్లో జరగనున్న చర్చల్లో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఆశిస్తున్నప్పటికీ, అణురహిత ఇరాన్ డిమాండ్పై అమెరికా ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. దౌత్యపరమైన మార్గాలు ఫలించకపోతే అధ్యక్షుడికి ఇతర ఎంపికలు ఉన్నాయని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరికలు చేసినట్లు లీవిట్ వెల్లడించారు. అదే సమయంలో, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన భూగర్భ స్థావరాల్లో దీర్ఘశ్రేణి ఖొర్రామ్షహర్–4 క్షిపణులను మోహరించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. మరోవైపు అమెరికా ఇప్పటికే ఈ ప్రాంతంలో విమాన వాహక నౌకలు, యుద్ధనౌకలు, నిఘా విమానాలు, అదనపు దళాలను మోహరించిన విషయం తెలిసిందే. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళనకారులకు ఏమైనా జరిగితే జోక్యం చేసుకుంటామని టెహ్రాన్ను హెచ్చరించారు.
ఈ పరిణామాల మధ్య, పెరిగిన ఉద్రిక్తతల తర్వాతే ఇరుదేశాలు అణు చర్చలకు అంగీకరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఒమన్ వేదికగా జరిగే ఈ సమావేశాల్లో అణు అంశంతో పాటు మరికొన్ని కీలక విషయాలపై కూడా చర్చలు జరపాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!