

నగరంలో రెండో దశ చెరువుల పునరుజ్జీవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.303 కోట్ల వ్యయంతో 14 తటాకాలను అభివృద్ధి చేయాలన్న HYDRA కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే తొలి దశలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకోవడంతో, ఆక్రమణలు మరియు కాలుష్యం నుంచి విముక్తి పొందిన చెరువులు పూర్తి విస్తీర్ణంతో సందర్శకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే ఉత్సాహంతో రెండో దశ పనులను త్వరలో ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చాలని ప్రభుత్వము HMDAకు సూచించింది.
నగరానికి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ వరద నియంత్రణకు వరంలాంటిదని అధికారులు పేర్కొన్నారు. గతంలో ఆక్రమణల కారణంగా చెరువులు, నాలాలు 80 శాతం వరకు కుదించుకుపోయి నగరాన్ని ప్రమాదంలోకి నెట్టాయని తెలిపారు. ఈ నేపథ్యంలో HYDRA చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసి, పూడిక తొలగింపు, కంచె ఏర్పాటు, కాలిబాటల అభివృద్ధితో పాటు పూల మొక్కలు, పార్కులు, యాంపీథియేటర్లు, బోటింగ్ వంటి సౌకర్యాలతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. వరద ముంపు సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ తటాకాలను ఎంపిక చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!