

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం లో జరిగిన విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా పాలన సమయంలో చేపట్టిన ఈ పనుల్లో దాదాపు 50 కిలోల బంగారం మాయం అయ్యిందని ఫిర్యాదులు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం లోతైన విచారణ ప్రారంభించింది.
2022–23 మధ్య కాలంలో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయడానికి తితిదే సుమారు 100 కిలోల బంగారం కేటాయించింది. నిబంధనల ప్రకారం తొమ్మిది పొరల తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పనులు పూర్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సగానికి పైగా బంగారం వాడకుండానే మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాక, గోపురంపై ఉన్న 30 విగ్రహాలు ధ్వంసం చేసి పనులు చేసినట్లు, అసలు కాంట్రాక్టర్ను పక్కన పెట్టి సబ్-లీజు కింద ఇతరులకు పనులు అప్పగించినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. అప్పట్లో ఈ వ్యవహారాన్ని బయటకు రానివ్వకుండా ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు అప్పటి ఫిర్యాదుదారులు, కార్మికులు, అధికారులను విచారిస్తూ బంగారం వినియోగం, పనుల నాణ్యతపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!