

నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్గృహకల్ప కాలనీలో అర్ధరాత్రి గంజాయి మత్తులో ఉన్న యువకుల గ్యాంగ్ హింసాత్మకంగా ప్రవర్తించింది. స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం, సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తరుణ్ నాయక్, సీతారామ్ నాయక్ అనే ఇద్దరు ఆటోలో ఇంటికి వెళ్తుండగా, మత్తులో ఉన్న తిలక్ అనే వ్యక్తి మరియు అతని ముగ్గురు సహచరులు వారిపై దాడి చేశారు.
వారిని పక్కకు పోమని అడిగిన మాటకు ఆగ్రహంతో స్పందించిన గ్యాంగ్ సభ్యులు, ఆటోను ఆపి ఇద్దరిపై దాడి చేసి తలలకు గాయాలు చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాచుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ప్రకారం, ప్రధాన నిందితుడు తిలక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు దాడిలో పాల్గొన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికుల ప్రకారం, తిలక్కు చెందిన గ్యాంగ్ రాజీవ్గృహకల్ప కాలనీలోని పలు బ్లాక్లలో రాత్రివేళ గంజాయి అమ్మకం, సేవ చేస్తూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే “నీ అంతు చూస్తాం” అంటూ బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. స్థానికుడు రామచంద్ర నాయక్ మాట్లాడుతూ, “మేము ప్రాణాలు చేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. చిన్న పిల్లలకు గంజాయి అలవాటు చేస్తూ కాలనీ వాతావరణాన్ని చెడగొడుతున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.











కామెంట్స్ (1)
Strict action needed