

ఢిల్లీ ఎర్రకోట వద్ద 13 మందిని బలితీసుకున్న కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడుతున్నాయి. ఈ ఘోరానికి కారణమైన వారు సాధారణ నేరస్థులు కాదు అసలైన ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు కావడం అధికారులు షాక్కు గురయ్యారు. పేలుడు జరిగిన ఐ20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ గా తేలగా, డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీద్ సయీద్లు కూడా ఈ కుట్రలో భాగమని తెలిసింది.
వీరు తమ ప్లాన్ను అమలు చేయడానికి వాడిన టెక్నాలజీ ఇప్పుడు చర్చగా మారింది. ఇది స్పై నెట్వర్క్లు ఉపయోగించే ‘డెడ్ డ్రాప్’ ఇమెయిల్ టెక్నిక్. అందరూ ఒకే ఇమెయిల్ అకౌంట్ను వాడుతూ, సందేశాన్ని పంపకుండా డ్రాఫ్ట్లో సేవ్ చేస్తారు. మరొకరు లాగిన్ అయి ఆ డ్రాఫ్ట్ను చదివి డిలీట్ చేస్తారు. మెయిల్ అసలు ‘సెండ్’ అవ్వకపోవడం వల్ల డిజిటల్ ట్రేస్ దొరకడం చాలా కష్టం.
ఇంతటితో ఆగకుండా, నిఘా సంస్థల కన్నుగప్పడానికి థ్రీమా, టెలిగ్రామ్ వంటి అత్యంత సురక్షిత యాప్లను కూడా వాడినట్లు దర్యాప్తు వెల్లడించింది. ఈ డాక్టర్లు టెక్నాలజీని ఎంత పకడ్బందీగా వాడుకున్నారో చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
ఇంకా పెద్ద విధ్వంసానికి వీళ్లు రెడీ అయ్యారని పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు కొద్ది రోజుల ముందే, జమ్మూ–కాశ్మీర్ పోలీసులు ముజమ్మిల్, షాహీద్ లను అరెస్ట్ చేశారు. ఢిల్లీ సమీపంలోని వీరి నివాసాల్లో సోదాలు చేయగా, 3,000 కిలోల పేలుడు పదార్థాలు, బాంబు తయారీ సామగ్రి, అలాగే షాహీద్ కారులో రైఫిల్, బుల్లెట్లు లభించాయి. ఈ అరెస్టులతో అసలు టెర్రర్ మాడ్యూల్ బయటపడింది.
సహచరులు పట్టుబడడంతో, డాక్టర్ ఉమర్ మహమ్మద్ తీవ్ర భయానికి గురై తన దగ్గరున్న బాంబుతో ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని ముజమ్మిల్ గదిలో వీరు రహస్య సమావేశాలు జరిపినట్లు, పాకిస్థాన్కు చెందిన జైష్-ఏ-మొహమ్మద్తో సంబంధాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!