

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 28న పెద్దపల్లి , జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అదే రోజు నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి,వికారాబాద్ , సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అక్టోబర్ 29న అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ కొనసాగుతుంది.
హైదరాబాద్లో పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు పెరగవచ్చని, బియ్యం కొనుగోలు కార్యక్రమాలు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు మంత్రులు అధికారులను ఆదేశించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రక్షించడానికి టార్పాలిన్లు ఉపయోగించి, నిల్వలను త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. అలాగే ప్రభావిత ప్రాంతాల్లో కోతలను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు.
ఇదిలావుండగా, తుఫాను తీవ్రతరం కావడంతో రాబోయే కొద్ది రోజుల్లో ప్రయాణికులు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణ సలహాను జారీ చేసింది.










కామెంట్స్ (2)
అప్రమత్తం!
stay safe