

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం, సులభమైన పాలసీలు ఉన్న తెలంగాణతో కలిసి పని చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ రోజు(మంగళవారం) వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా దావోస్లో ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తును ఎదురుచూడకుండా దానిని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర రోడ్మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, హెల్త్కేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రో ఇండస్ట్రీస్, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. గత రెండేళ్లలో దావోస్ వేదికగా సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని, ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను కూడా ఆవిష్కరిస్తామని వెల్లడించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!