

మయన్మార్లోని సైబర్ క్రైమ్ నెట్వర్క్ల బారిన పడిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో 370 మందిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా ఢిల్లీకి చేర్చింది. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 55 మంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బాధితులు ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారని సమాచారం.
ఢిల్లీ చేరుకున్న వెంటనే ఏపీ భవన్ అధికారుల బృందం కేంద్ర అధికారులతో మాట్లాడి వారిని ఏపీ భవన్కు తరలించింది. వారికి తాత్కాలిక వసతి, ఆహారం వంటి సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. మయన్మార్లో ఉండగా వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో, డబ్బులు లేకపోవడంతో వారి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.1,000 చొప్పున సహాయం అందించింది.
వారి తిరుగు ప్రయాణం సాఫీగా ఉండేందుకు రైల్వే అధికారులతో సమన్వయం చేసి టికెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మయన్మార్ సైబర్ నెట్వర్క్ నుంచి బయటపడిన 79 మంది ఏపీ వాసులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా స్వస్థలాలకు పంపించడం జరిగింది.
స్వదేశానికి చేరుకుని భద్రత కల్పించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ కృతజ్ఞతలు తెలిపారు బాధితులు.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!