

ఆస్ట్రేలియాలో సముద్రంలో కొట్టుకుపోయిన తన తల్లి, ఇద్దరు తోబుట్టువులను కాపాడేందుకు 13 ఏళ్ల బాలుడు అసాధారణ సాహసం చేశాడు. ఉద్ధృత అలలతో అల్లకల్లోలంగా మారిన సముద్రంలో దాదాపు నాలుగు గంటలపాటు ఈదుతూ తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాడు. బాలుడు ఇచ్చిన సమాచారంతో హెలికాప్టర్ సాయంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు తల్లి, మరో ఇద్దరు పిల్లలను సురక్షితంగా కాపాడాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ సమీపంలో జరిగింది.
పెర్త్కు చెందిన జోవాన్ అపెల్బీ తన ముగ్గురు పిల్లలతో కలిసి కయాక్లు, పెడల్ బోర్డ్లపై సముద్ర విహారానికి వెళ్లగా వాతావరణం అకస్మాత్తుగా మారడంతో వారు తీరానికి దూరంగా కొట్టుకుపోయారు. తల్లి సూచనతో పెద్ద కుమారుడు ఆస్టిన్ తీరానికి చేరుకుని సాయం కోరేందుకు ప్రయత్నించాడు. మొదట కయాక్పై బయల్దేరినా నీరు చేరడంతో దాన్ని వదిలేసి, చివరకు లైఫ్ జాకెట్ లేకుండానే సుమారు నాలుగు కిలోమీటర్లు ఈదాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తల్లి మరియు ఇద్దరు పిల్లలు తీరానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో పెడల్ బోర్డులను పట్టుకుని ఉన్నారు. నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ ఆసుపత్రి చికిత్స అవసరం రాలేదు. బాలుడి ధైర్యసాహసాలను అధికారులు ప్రశంసించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!