

ఎయిర్ ఇండియా కు చెందిన ఓ డ్రీమ్లైనర్ విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్లో లోపం ఉండొచ్చనే అనుమానంతో ఆ విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంస్థ వెల్లడించింది. పైలట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, లండన్ నుంచి బయలుదేరిన Boeing 787-8 Dreamliner విమానం సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం ఇంధన నియంత్రణ స్విచ్లో సాంకేతిక లోపం ఉండొచ్చని పైలట్ ఫిర్యాదు చేయడంతో, విమానాన్ని సేవల నుంచి తప్పించారు.
ఈ అంశాన్ని DGCA దృష్టికి తీసుకెళ్లినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. డీజీసీఏ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, ఎయిర్ ఇండియా చెందిన అన్ని బోయింగ్ 787 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ల పై సమగ్ర తనిఖీలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. ఈ తనిఖీల్లో ఇతర విమానాల్లో ఎలాంటి లోపాలు గుర్తించలేదని పేర్కొంది.
అలాగే, సంబంధిత విమానాన్ని విమాన తయారీ సంస్థ నిపుణులతో కలిసి పూర్తిగా పరిశీలిస్తున్నామని ఎయిర్ ఇండియా తెలిపింది. భద్రతే ప్రధాన లక్ష్యమని, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు విమానాన్ని సేవల్లోకి తీసుకురామన్నది సంస్థ వైఖరి.
ఇదిలా ఉండగా, గతేడాది అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి, Aircraft Accident Investigation Bureau (ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో ఇంధన స్విచ్ల వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొన్న విషయం తెలిసిందే. క్షణాల్లోనే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ప్రమాదం జరిగినట్లు ఆ నివేదిక వెల్లడించింది. ఈ నేపధ్యంలో తాజా ఘటన విమాన భద్రత పరంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!