

కోలీవుడ్ స్టార్ ధనుష్ చెన్నైలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని తన చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. నాలుగో తరగతి వరకు తన పుట్టినరోజు ఎప్పుడు వస్తుందో కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు. స్కూల్లో స్నేహితులు కొత్త దుస్తులు వేసుకుని చాక్లెట్లు పంచుతుంటే తానూ అలాంటి వేడుక చేసుకోవాలని అనిపించేదని, తన అక్క చెప్పిన తర్వాతే జూలై 28 తన పుట్టినరోజు అని తెలుసుకున్నానని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులను ఒప్పించి కొత్త దుస్తులు కొనిపించుకుని, తన దగ్గరున్న డబ్బుతో చాక్లెట్లు కొనుగోలు చేసి సహచర విద్యార్థులకు పంచిన రోజులను గుర్తు చేసుకున్నారు.
కాలం గడిచేకొద్దీ పుట్టినరోజుపై తన ఆసక్తి తగ్గిపోయిందని ధనుష్ చెప్పారు. చిన్నప్పుడు ఆ రోజు ఎంతో ప్రత్యేకంగా అనిపించేదని, ఇప్పుడు మాత్రం అభిమానులు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం చూసి ఎంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. అలాగే అభిమానులు సినిమా వేడుకలకే పరిమితం కాకుండా రక్తదానం, సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!