

రోడ్లపై అడ్డదిడ్డంగా పార్క్ చేసే వాహనాలు, రోజుల తరబడి వదిలేసే బ్రేక్డౌన్ వాహనాల కారణంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర రవాణాశాఖ కొత్త టోయింగ్ పాలసీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ముసాయిదా పాలసీని ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి తుది పాలసీ అమలు చేసే అవకాశముంది. ఈ కొత్త విధానం ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు భద్రతను మెరుగుపరచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముసాయిదా ప్రకారం నో పార్కింగ్ జోన్లు, ఫుట్పాత్లు, ట్రాఫిక్కు అడ్డంగా నిలిపిన లేదా బ్రేక్డౌన్ అయిన వాహనాలను వెంటనే టోయింగ్ చేసి పార్కింగ్ యార్డులకు తరలిస్తారు. వాహన యజమానులు టోయింగ్ ఛార్జీలు, రోజువారీ పార్కింగ్ ఫీజులు, పెండింగ్ చలాన్లు, రోడ్ ట్యాక్స్, బీమా, ఫిట్నెస్ జరిమానాలు అన్నింటినీ చెల్లించిన తర్వాతే వాహనాలను తిరిగి పొందగలరు. 30-45 రోజుల పాటు క్లెయిమ్ చేయని వాహనాలను వేలం వేసే ప్రతిపాదన కూడా ఉంది. దీనికోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని రవాణాశాఖ ప్రతిపాదించింది. ద్విచక్ర వాహనాలకు రోజుకు రూ.20-30 నుంచి బస్సులకు రూ.200-300 వరకు పార్కింగ్ ఛార్జీలు ఉండే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!