

ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 42 రోజుల క్రితమే మరణించిన వ్యక్తి ఫోన్కు.. ‘‘మా ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకొని వెళ్లినందుకు సంతోషంగా ఉంది’’ అంటూ సందేశం వచ్చింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రాయ్పూర్కు చెందిన 39 ఏళ్ల కానిస్టేబుల్ దేవనారాయణ్ రామ్ అనారోగ్యంతో జూన్ 26న అంబికాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ జూన్ 30న మృతి చెందారు. అదే ఆస్పత్రిలో ఆయన భార్య సీమా నర్సుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి, మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు.
అయితే ఆగస్టు 6న ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేవనారాయణ్ ఫోన్కు ఆస్పత్రి నుంచి సందేశం వచ్చింది. అందులో ఆయన చికిత్స అనంతరం కోలుకొని వెళ్లారని, ఉచిత వైద్య సేవలపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆస్పత్రి అధికారులను ప్రశ్నించగా.. డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. బాధ్యుడైన ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. అయితే మృతుడి భార్య సీమా మాత్రం తన భర్త ఆయుష్మాన్ కార్డును మరణానంతరం దుర్వినియోగం చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. ఆయుష్మాన్ పోర్టల్లో క్లెయిమ్ మూసివేయడంలో జాప్యం కారణంగానే సందేశం ఆలస్యంగా వచ్చిందని వివరించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!