

స్పీడ్ పోస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా గంజాయిని సరఫరా చేస్తున్న భారీ అక్రమ ముఠా గుట్టును హైదరాబాద్ హెచ్-న్యూ పోలీసులు ఛేదించారు. ఇటీవల 2 కిలోల గంజాయితో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన కేసు దర్యాప్తులో ఈ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్కు చెందిన ముఠా నాయకుడు సత్యం మిశ్రాను పోలీసులు అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు.
సీపీ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, జార్ఖండ్ నుంచి గంజాయిని సేకరించిన ముఠా దానిని మందుల పేరుతో స్పీడ్ పోస్ట్ ద్వారా 21 రాష్ట్రాలకు పంపుతోంది. రోజుకు 80 నుంచి 100 పార్సిళ్లు పంపుతూ వాట్సాప్లో "ఫ్లవర్", "మ్యాంగో", "స్టిక్" వంటి కోడ్ పదాలతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ అక్రమ గంజాయి దందా ద్వారా ముఠా నెలకు సుమారు రూ.50 లక్షలు, ఏడాదికి దాదాపు రూ.5 కోట్లు సంపాదిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, బంగారం, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుండగా, అక్రమ ఆస్తుల స్వాధీనానికి కూడా చర్యలు ప్రారంభించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!