

గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోజుకు సుమారు 24 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. పథకం ద్వారా మహిళలు బస్సు ఛార్జీలను ఆదా చేసుకుని ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలు, వ్యాపారాలు, పిల్లల చదువులకు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి, వారితో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా మహిళల కుటుంబ పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, పిల్లల చదువులు, ఆరోగ్యం, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలపై సీఎం ఆరా తీశారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ మత్స్యకార మహిళ గతంలో బస్సు ఛార్జీల కోసం ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు మిగులుతోందని, నెలకు సుమారు రూ.4 వేలు ఆదా అవుతున్నాయని తెలిపారు. నంద్యాలకు చెందిన మరో మహిళ నెలకు సుమారు రూ.1,500 ఆదా అవుతోందని, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందుతున్నాయని చెప్పారు. మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం పెరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!