

మర్చంట్ నేవీ కెప్టెన్ ఆశిష్ కుమార్ బతికే ఉన్నారని ఆయన భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన డ్రోన్ దాడిలో ఆశిష్ మరణించారన్న వార్తలను కుటుంబ సభ్యులు తిరస్కరిస్తున్నారు. ఆయన విదేశీయుల చెరలో బందీగా ఉన్నారని అనుమానిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఆయన ఆచూకీని గుర్తించి కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
బిహార్లోని బెట్టియాకు చెందిన ఆశిష్ కుమార్ మార్చిలో ఒమన్ తీరంలో స్కైలైట్ చమురు ట్యాంకర్పై జరిగిన డ్రోన్ దాడి తర్వాత గల్లంతయ్యారు. ఆ సమయంలో ఎనిమిది మంది భారతీయ నావికులను రక్షించగా, ఆశిష్ కుమార్తో పాటు మరో సిబ్బంది కనిపించలేదు. అనంతరం కెప్టెన్ గదిలో కాలిన మానవ అవశేషాలు లభించినప్పటికీ, అవి ఆశిష్వేనని నిర్ధారించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. డీఎన్ఏ పరీక్షల ఫలితాలు కూడా సరిపోలలేదని, ఆయనను విడుదల చేయాలంటే రూ.20 లక్షలు చెల్లించాలని అంతర్జాతీయ నంబర్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కుటుంబం కోరుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!