

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాన్ ఫ్రాన్సిస్కోలో బే ఏరియా పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమై పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణను తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యాచరణ, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, హైదరాబాద్ ఐటీ, ఆవిష్కరణలు, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ సర్వీసెస్ రంగాల్లో సాధిస్తున్న పురోగతిని వివరించారు. పారదర్శక పరిపాలన, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు యువతను సిద్ధం చేయడంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త ఆలోచనలను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సమావేశంలో ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు, సాంకేతిక సహకారం, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటూ తెలంగాణతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!