

పుట్టపర్తిలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (అమ్కా) ప్రాజెక్టు శంకుస్థాపన అనంతరం మాట్లాడిన రాజ్నాథ్ సింగ్, ఈ ప్రాజెక్టు దేశ రక్షణ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, ఆంధ్రప్రదేశ్ ఆధునిక రక్షణ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకుడని కొనియాడుతూ, టెక్నాలజీ మరియు అభివృద్ధి గురించి ఇంత లోతుగా ఆలోచించే నాయకుడిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. గూగుల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని తెలిపారు.
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో అమలవుతున్న అమ్కా ప్రాజెక్టులో ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని చెప్పారు. అదేవిధంగా డ్రోన్ తయారీ, అటానమస్ అండర్వాటర్ వ్యవస్థలు, టార్పెడోలు, ఆధునిక ఆయుధాలు, ఎలక్ట్రిక్ ఫ్యూజ్ల తయారీకి సంబంధించిన పలు రక్షణ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు. కర్నూలు ప్రపంచ డ్రోన్ హబ్గా మారుతుందని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ ప్రాజెక్టులు మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు. గత దశాబ్దంలో దేశ రక్షణ ఉత్పత్తి రూ.46 వేల కోట్ల నుంచి రూ.1.54 లక్షల కోట్లకు పెరిగిందని, రక్షణ ఎగుమతులు రూ.600 కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!