

తెలంగాణలో భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చట్టపరంగా క్లియర్ అయిన భూములను కూడా మళ్లీ 22Aలో చేర్చి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం చెల్లింపులు చేసిన తర్వాత భూమి 22Aలో ఉందంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నారని, గతంలో రుణాలు పొందిన ఆస్తుల విషయంలో ప్రజలు, బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
22A నుంచి భూములను తొలగించేందుకు రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2023 డిసెంబర్ 7 నుంచి భూములను నిషేధిత జాబితాలో చేర్చిన వివరాలతో ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేయాలని, తప్పుగా చేర్చిన ఆస్తులను 22A పరిధి నుంచి తొలగించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ఆస్తి కూడా 22A జాబితాలో ఉన్నట్లు ప్రస్తావిస్తూ, సామాన్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!