

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ మార్కెట్ల బలహీన సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.17 లక్షల కోట్లు తగ్గి రూ.472.38 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 777.94 పాయింట్లు నష్టపోయి 74,003.82 వద్ద, నిఫ్టీ 279.50 పాయింట్లు కోల్పోయి 23,118.60 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ మూడు నెలల కనిష్ఠానికి, నిఫ్టీ ఐదు నెలల కనిష్ఠానికి చేరాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 34 పైసలు క్షీణించి 95.88 వద్ద స్థిరపడగా, బ్రెంట్ ముడి చమురు 3.38 శాతం పెరిగి 109.24 డాలర్ల వద్ద ట్రేడైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2,977.86 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,686.05 కోట్ల కొనుగోళ్లు చేశారు.
సెన్సెక్స్లోని 30 షేర్లలో ఏడు మినహా మిగతావన్నీ నష్టాల్లో ముగిశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండిగో, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ట్రెంట్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. మరోవైపు కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి నెమ్మదించవచ్చన్న పరిశ్రమ నిపుణుల వ్యాఖ్యలతో సంప్రదాయ ఐటీ సేవలకు డిమాండ్పై ఆందోళనలు తగ్గడంతో ఐటీ షేర్లు రాణించాయి. హెచ్సీఎల్ టెక్, హెగ్జావేర్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో లాభపడ్డాయి. టాటా సన్స్ ఎన్బీఎఫ్సీ లైసెన్సు సరెండర్ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించిందన్న వార్తల నేపథ్యంలో టాటా గ్రూప్లోని పలు షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ షేరు తొలి రోజు ఇష్యూ ధరతో పోలిస్తే లాభంతో ముగిసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!