

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంప్రదాయ ఐటీ సంస్థలను లేదా ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే అభిప్రాయాలను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నీలేకని ఖండించారు. సంస్థ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, ఏఐ ఐటీ రంగానికి ముప్పు కాదని, సంస్థల సామర్థ్యాన్ని మరింత పెంచే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. 2030 నాటికి 400 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ-ఫస్ట్ సేవల అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఇన్ఫోసిస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
జనరేటివ్ ఏఐ విప్లవం ప్రారంభమై మూడు సంవత్సరాలకు పైగా గడిచినా, ఇన్ఫోసిస్ మరింత బలంగా భవిష్యత్తుకు సిద్ధమైందని నందన్ నీలేకని తెలిపారు. ఆధునిక ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్ను ఉపయోగించి ఉత్పాదకతను పెంచుతున్నామని, సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చుతున్నామని చెప్పారు. ఏఐ సంస్థలను భర్తీ చేయదని, దానిని సమర్థంగా వినియోగించే కంపెనీలను మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ టాప్ 200 క్లయింట్లలో దాదాపు 90 శాతం కంపెనీల ఏఐ ప్రయాణంలో ఇన్ఫోసిస్ భాగస్వామిగా ఉందని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!