

ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోజుకో ఆరోపణ ఆధారాలతో వెలుగులోకి వస్తున్నాయని, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించే పోస్టులు, ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారని జగన్ ఆరోపించారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల్లో కొన్ని ఖాతాలు, పోస్టులు భారత్లో కనిపించకుండా చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని జగన్ విమర్శించారు. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు మాయమవ్వవని, ఖాతాలను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరని అన్నారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగితే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తూ.. ఆంక్షలు విధించిన ఖాతాలు, పోస్టులను పునరుద్ధరించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి లోకేశ్, విద్యాశాఖ అధికారులు గతంలో స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!