

సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని తెలంగాణలో జాతీయ జెండా ఆవిష్కరణపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. జాతీయ జెండా దేశ ప్రజలందరిదని, దాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించవద్దని అన్నారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అధికారిక కార్యక్రమాల్లో జెండాను ఆవిష్కరించారని తెలిపారు. కాగా, సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టింది.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక సందర్భాన్ని అందరూ గౌరవించాలని, అయితే దాన్ని ఏ ఒక్క పార్టీ లేదా సిద్ధాంతానికి పరిమితం చేయడం సరికాదని పొన్నం అన్నారు. జమ్మూ-కాశ్మీర్, జునాగఢ్ వంటి ఇతర సంస్థానాల విలీన చరిత్రను కూడా సమగ్రంగా ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, సహకారంపై దృష్టి పెట్టాలని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులు, వారి కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!