

ఆసియా క్రీడలు మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుండగా.. భారత్ పోటీలు మాత్రం గురువారం టెక్బాల్తో మొదలుకానున్నాయి. పురుషుల డబుల్స్లో మహ్మద్ అనాస్, డెక్లాన్ గొన్సాల్వెస్ పతక వేటను ప్రారంభించనున్నారు. భారత్ నుంచి మొత్తం ముగ్గురు క్రీడాకారులు ఈసారి టెక్బాల్లో బరిలోకి దిగుతున్నారు. ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్ అంశాలను కలిపి రూపొందించిన ఈ క్రీడను హంగేరీకి చెందిన ముగ్గురు ఫుట్బాల్ అభిమానులు అభివృద్ధి చేశారు. 2016లో అంతర్జాతీయంగా పరిచయమైన టెక్బాల్కు ఈసారి ఆసియా క్రీడల్లో తొలిసారి చోటు దక్కింది.
టెక్బాల్ను టేబుల్ టెన్నిస్ బోర్డును పోలిన ప్రత్యేకంగా రూపొందించిన వంపు ఉన్న బోర్డుపై ఆడతారు. అయితే ఇక్కడ ఫుట్బాల్ను ఉపయోగిస్తారు. బంతిని చేతులతో తాకకుండా కాళ్లు, మోకాళ్లు, తల, తొడలు, ఛాతి తదితర శరీర భాగాలతో ఆడాలి. గరిష్ఠంగా మూడు ప్రయత్నాల్లో బంతిని ప్రత్యర్థి వైపు బోర్డుపై పడేలా పంపాలి. డబుల్స్లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మూడు టచ్లలోనే బంతిని తిరిగి పంపాలి. వరుసగా రెండుసార్లు శరీరంలోని ఒకే భాగాన్ని ఉపయోగించకూడదు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో పోటీలు నిర్వహిస్తారు. మ్యాచ్లు బెస్ట్ ఆఫ్ త్రీ సెట్ల విధానంలో జరుగుతాయి. ముందుగా 12 పాయింట్లు సాధించిన ఆటగాడు లేదా జట్టు సెట్ను గెలుస్తుంది. 11-11తో స్కోరు సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం వచ్చే వరకు ఆట కొనసాగుతుంది. ఫిట్నెస్, సమన్వయం, బంతిపై నియంత్రణ ఈ క్రీడలో కీలకం. భారత్ తరఫున మహ్మద్ అనాస్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో, డెక్లాన్ గొన్సాల్వెస్ డబుల్స్లో, క్విమ్సి డిసౌజా సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో పోటీపడనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!