

తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆధ్యాత్మిక అనుభూతి అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరు సూత్రాలతో కూడిన బృహత్తర ప్రణాళికను ప్రకటించారు. తిరుమలను ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కొండపై కొత్త కాంక్రీట్ నిర్మాణాలను నియంత్రించడం, కాలుష్యాన్ని తగ్గించి నెట్ జీరో ప్రాంతంగా తీర్చిదిద్దడం, సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ద్వారా 100 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం వంటి చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. వ్యర్థాల నిర్వహణతో పాటు పూల వ్యర్థాలతో అగరబత్తులు, చెత్త నుంచి బయోగ్యాస్ వంటి సర్క్యులర్ ఎకానమీ విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తుల ఉచిత రవాణా కోసం ఇటీవల 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడంతో మొత్తం ఉచిత బస్సుల సంఖ్య 50కి చేరింది.
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం తెలిపారు. టీసీఎస్ సహకారంతో ఆధునికీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో నాలుగు అంతస్తులు, 14 గ్యాలరీలు, 8,000కుపైగా ప్రదర్శనలు, హోలోగ్రాఫిక్ సాంకేతికత, 360 డిగ్రీల సౌండ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ‘దుర్లభ దర్శనం’ పేరుతో వీఆర్ అనుభవ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఆరు సూత్రాల్లో అన్నదానం, ప్రాణదానం-వైద్య సేవలు, శ్రీవారి సేవకుల విస్తరణ, విద్యాదానం-నైపుణ్యాభివృద్ధి, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల నిర్మాణం, ‘వృక్షో గోవిందం’ ద్వారా పర్యావరణ పరిరక్షణ ఉన్నాయి. టీటీడీ ఆస్తులు, భూములు, ఆభరణాలు, నగదు వివరాలను డాక్యుమెంట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకత పెంచుతామని సీఎం తెలిపారు.
అన్నదానం: నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగించేలా నిధుల బలోపేతం.
ప్రాణదానం: తిరుపతిని సమగ్ర వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయడం.
శ్రీవారి సేవకులు: సేవకులకు శిక్షణ ఇచ్చి టీటీడీ సేవల్లో భాగస్వామ్యం చేయడం.
విద్యాదానం: విద్యార్థులకు ఉపాధి ఆధారిత విద్య, నైపుణ్యాభివృద్ధి కల్పించడం.
ఆలయాల నిర్మాణం: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చిన్న, పెద్ద ఆలయాల నిర్మాణం.
వృక్షో గోవిందం: పవిత్ర వనాలు, ఔషధ మొక్కలు, నీటి సంరక్షణకు ప్రాధాన్యం



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!