

భారత హాకీ జట్టులో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని దిగ్గజ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. ఇటీవలి ప్రపంచకప్లో భారత్ ప్రదర్శన, ఆసియా క్రీడల్లో జట్టు అవకాశాలపై మాట్లాడిన ఆయన.. రెండు టోర్నీలు పూర్తిగా భిన్నమైనవని పేర్కొన్నాడు. ఆసియా క్రీడల్లో భారత్కు స్వర్ణం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, గత కొన్నేళ్లుగా ఈ టోర్నీలో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పాడు. ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుందని గుర్తుచేస్తూ.. భవిష్యత్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను ఇప్పటి నుంచే సీనియర్ జట్టులోకి తీసుకురావాలని సూచించాడు. జూనియర్ స్థాయి నుంచి రాణిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి, సీనియర్ స్థాయి ఆటకు అనుగుణంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నాడు.
ప్రపంచకప్లో భారత్ ఎక్కువ గోల్స్ ఇవ్వడం, లభించిన గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వంటి అంశాలను శ్రీజేష్ ప్రస్తావించాడు. డిఫెన్స్తో పాటు ఎటాకింగ్లోనూ జట్టు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రత్యర్థి జట్లు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు అమలు చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అవసరమని చెప్పాడు. యూరప్ జట్లు ఎటాకింగ్లో మరింత దూకుడుగా ఉంటాయని, వాటి స్థాయిని అందుకోవాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించాడు. కొత్త విధానాల ఫలితాలు వెంటనే కనిపించవని, ఆటగాళ్లు, కోచ్లు సమష్టిగా కృషి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని శ్రీజేష్ పేర్కొన్నాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!