

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’ అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చిన ఆయన అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాజకీయాలు, పాలన, డీలిమిటేషన్, కృత్రిమ మేధ, సాంకేతికత వంటి అంశాలపై మాట్లాడారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలను దామాషా ప్రాతిపదికన పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానాలను దామాషా ప్రకారం పెంచాలని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి నమూనాను నిర్దిష్టత, అవకాశాలు అనే రెండు భావనల ఆధారంగా కేటీఆర్ వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయ ప్రజా సేవలతో స్థిరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు.. ఇన్నోవేషన్, వ్యవస్థాపకత, కొత్త అవకాశాలను ప్రోత్సహించే ఎకోసిస్టమ్ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లో టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్, టాస్క్ వంటి సంస్థల పాత్రను వివరించారు. కొత్త సాంకేతికతను స్వీకరించి ముందుకు సాగాలని, పరిమితులను సమస్యలుగా కాకుండా నేర్చుకోవడం, మెరుగుపరచడం, అమలు చేయడానికి అవకాశాలుగా చూడాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్లో టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్, టాస్క్ వంటి సంస్థలు భాగంగా ఉన్నాయని రాష్ట్ర స్టార్టప్ పోర్టల్ పేర్కొంటోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!