

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను 2034 వరకు సీఎంగా ఉంటానని, యువతకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాల్లోనూ ఉద్యోగాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. గత పాలకులు కుటుంబ, రాజకీయ ప్రయోజనాలకే పరిమితమై ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వారికి భూములు, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి నాణ్యమైన విద్యే ప్రధాన లక్ష్యమని అన్నారు.
‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్-3 ఉద్యోగాలు పొందిన 1,370 మందికి నియామక పత్రాలు అందజేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. డీఎస్సీని 55 రోజుల్లో పూర్తిచేసి 11 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, గ్రూప్-1 సహా ఇప్పటివరకు సుమారు 70 వేల నియామకాలు జరిగాయని వెల్లడించారు. ఉద్యోగం కేవలం వేతనం కాదు, జీవితకాల భావోద్వేగమని, ఆ బాధ్యతతో తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!