

కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఇవాళ(శనివారం) భారీ పేలుడు (Kakinada District Firework Explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరింది. ఈ విషాదకర ఘటన సమయంలో బాణసంచా కేంద్రంలో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించగా, వారిలో కొందరిని కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న ఇద్దరు క్షతగాత్రులు కూడా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 23కి పెరిగింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందజేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!