

నార్త్కరోలినాలోని క్యారీ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన ద్వార పాలకుల విగ్రహాల్లో ఒకదాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ నిర్వాహక బోర్డు సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, కేసును ఛేదించేందుకు ఆలయ కమిటీ పూర్తిగా సహకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఈ సంఘటన తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా సంయమనం పాటిస్తూ ఐక్యతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ దుశ్చర్యకు సంబంధించి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే ఆలయ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. సోషల్ మీడియాలో ఊహాజనిత లేదా భావోద్వేగ పోస్టులు చేయవద్దని సూచించారు. శనివారం సాయంత్రం 7 గంటలకు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!