

ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన టీటీడీ పరకామణి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది పోలీసు అధికారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు స్పష్టంగా ఆదేశించింది.
ఈ కేసు దర్యాప్తును వేగవంతంగా కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు ధర్మాసనం సూచించింది. విచారణ సందర్భంగా, నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ సమర్పించిన నివేదికలో వెల్లడైన అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో, సంబంధిత పోలీసుల పై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
చోరీ ఘటనకు సంబంధించిన అంశాలను మినహాయించి, దర్యాప్తులో బయటపడిన ఇతర అంశాల పై సీఐడీ, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. అలాగే, పరకామణి కౌంటింగ్ ప్రక్రియ పై అవసరమైన సూచనలు ఇవ్వాలని కూడా కోర్టు పేర్కొంది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీ రెడ్డిలను ఇప్పటికే వీఆర్కు పంపిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాల నేపథ్యంలో, వీరి పై సీఐడీ క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అదే విధంగా, పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వన్టౌన్ సీఐ విజయ్కుమార్ పై కూడా కేసు నమోదు అవుతుందా అనే అంశం పై ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం పై తదుపరి విచారణను ఈ నెల 8 వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!